ఏయూలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు

 ఏయూలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు 
 ఈ ఏపీ సెట్ ద్వారా అడ్మిషన్లు 
- మొదటి సంవత్సరం 30 మందికి ప్రవేశాలు 
- ఆమోదం తెలిపిన ఏయు అకడమిక్ సెనేట్ 

 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్స్ కి సెనేట్ ఆమోదం తెలిపింది. ఈరోజు నిర్వహించిన అకడమిక్ సెనేట్ సమావేశంలో సభ్యులు నూతన కోర్సు ప్రారంభించడానికి ఆమోదాన్ని అందించారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఈ ఏపీ సెట్ ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం నుంచి నిర్వహించే కోర్సులో తొలి బ్యాచ్లో 30 మందికి ప్రవేశాన్ని కల్పిస్తారు. ఈ కోర్సు కు సంబంధించిన సబ్జెక్టులను కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ తదితర విభాగాల ఆచార్యులు నిపుణులు బోధన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోర్సును ఆంధ్ర విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా మెటీరియాలజీ ఓషనోగ్రఫీ విభాగం నుంచి గతంలో నిర్వహించి నిలిపివేసిన, ఎంటెక్ ఎట్మాస్ఫియరిక్ సైన్స్, ఎంటెక్ ఓషియానిక్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులలో ప్రవేశాలు జరుపుతారు. 

ఇంజనీరింగ్ కళాశాలలో పలు విభాగాల్లో డ్యూయల్ డిగ్రీ చేయడానికి అనుమతులను మంజూరు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నుంచి అన్ని పీజీ కోర్సులకు వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.సైన్స్ కళాశాల పరిధిలో పలు విభాగాలలో ఇంటర్న్ షిప్, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగం నుంచి ఏడాది కాలవ్యవధితో పీజీ డిప్లమో కోర్సును ఆక్వా కల్చర్ లో నిర్వహించడానికి ఆమోదముద్ర వేసింది. 

ఆంధ్ర విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం, థియేటర్ ఆర్ట్స్ విభాగాలను సమన్వయం చేస్తూ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏర్పాటు చేయాలని మాజీ ఉప కులపతులు సూచించారు .

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయానికి ప్రత్యేక గ్రాంట్ ను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వవిద్యాలయం తరఫున కోరాలని పాలకమండలి సభ్యులు, పూర్వ ఉప కులపతులు సూచించారు. దీనిపై ఏయూ వైస్ చాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ స్పందిస్తూ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో సమగ్ర ప్రతిపాదనలతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. 

సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ను బలోపేతం చేయాలని మాజీ వీసీ లు సూచించారు. విశ్వవిద్యాలయానికి ఇది మంచి పేరు, ప్రతిష్ట తీసుకొచ్చిందని చెప్పారు. 

ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తన ప్రారంభ ప్రసంగంలో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని వివరిస్తూ, విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను, పూర్వ విద్యార్థులతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిర్వహించిన చర్యలను సభ్యులకు వివరించారు. ఇటీవల కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు తెలియజేశారు.

సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయ రావు, మాజీ వీసీ లు ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి ఆచార్య బీలా సత్యనారాయణ, ఆచార్య జి.ఎస్. ఎన్ రాజు, ఆచార్య జి. నాగేశ్వరరావు, ఆచార్య పీ వి జి డి ప్రసాద్ రెడ్డి, పాలకమండలి సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ చైర్మన్లు, అకడమిక్ సెనేట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న